Revanth Reddy: ఈరోజు హరీశ్ వచ్చాడు.. రేపు కేసీఆర్ మనవడు వస్తానంటాడు: రేవంత్ రెడ్డి

  • అసెంబ్లీకి కేసీఆర్ రావాలన్న రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ సిగ్గులేని మనిషని తీవ్ర వ్యాఖ్యలు
  • విజయసాయిరెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్ అని ఎద్దేవా
Revanth Reddy comments on Harish Rao

ఈరోజు బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బదులుగా హరీశ్ రావు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, బీఏసీ సభ్యుడు కాని హరీశ్ ను సమావేశానికి అనుమతించలేదు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెటైర్లు వేశారు. ఈరోజు హరీశ్ రావు వచ్చారని... రేపు కేసీఆర్ మనవడు హిమాన్షు వస్తానంటాడని ఎద్దేవా చేశారు. తాము కేసీఆరే రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయాన్ని మార్చే అంశం కూడా స్పీకర్ పరిధిలోనే ఉంటుందని అన్నారు. 

బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ అన్నారు. అధికారాన్ని కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని... ఆయనొక సిగ్గులేని మనిషని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నది మేనేజ్ మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రతి రోజు 12 టీఎంసీల నీటిని తీసుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేదని మండిపడ్డారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు. ఆయనొక నాన్ సీరియస్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు.

More Telugu News