KFC: అయోధ్యలో కేఎఫ్‌సీ.. ఆ ఒక్కటి తప్ప అన్నీ అమ్ముకోవచ్చట!

  • కేఎఫ్‌సీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న అయోధ్య కలెక్టర్
  • మాంసాహార పదార్థాల విక్రయానికి మాత్రం నో
  • శాకాహార పదార్థాలు అమ్ముకోవచ్చన్న కలెక్టర్
  • ఆలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో నిషేధం
KFC In Ayodhya what Temple Town Administration Says

కేఎఫ్‌సీ.. ఈ పేరెత్తితేనే చాలు నాన్‌వెజ్ ప్రియుల నోటిలో నీళ్లూరుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట అవుట్‌లెట్లు కలిగిన కేఎఫ్‌సీ త్వరలో అయోధ్యలోనూ దుకాణాలు తెరవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించింది. అయోధ్యలో మాంసాహార విక్రయాలపై నిషేధం ఉందని స్పష్టం చేసింది. కావాలంటే వారు శాకాహార పదార్థాలు అమ్ముకోవచ్చని తెలిపింది. 

అయోధ్యలో ఔట్‌‌లెట్ తెరవడాన్ని ఆహ్వానిస్తున్నామని అయితే, నిషేధిత ప్రాంతంలో శాకాహార పదార్థాలు మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని అయోధ్య జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ తెలిపారు. మాంసం, చేపలు, ఇతర మాంసాహార పదార్థాల విక్రయం, వినియోగాన్ని రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముందే యోగి ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు. అయితే, అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధి తర్వాత ఈ నిబంధనలేవీ వర్తించవని స్పష్టం చేశారు. 
 
అయోధ్య రామమందిరం ప్రారంభం తర్వాత రాముని దర్శనార్థం వచ్చే భక్తులతో అయోధ్య కిక్కిరిసిపోతోంది. భక్తుల రద్దీ పెరగడంతో వారి అవసరాలు తీర్చేందుకు పలువురు వ్యాపారులు దుకాణాలు తెరుస్తున్నారు. ఆలయ సమీపంలో హోటళ్లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేఎఫ్‌సీ కూడా ఔట్‌లెట్ తెరబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించి ఈ ప్రకటన చేసింది.

More Telugu News