Chandrababu: అమిత్‌షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం.. ఎన్డీయేలో చేరికపై చర్చ!

  • రాత్రి 11.25 నుంచి గంట పాటు అమిత్ షా, నడ్డాతో సమావేశం
  • ఇరు పార్టీల మధ్య ఈ సమావేశంలో ప్రాథమిక అవగాహన కుదిరినట్టు సమాచారం
  • దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎన్డీయే కూటమి అవసరమని షా అన్నట్టు వినికిడి
  • బీజేపీకి దేశం, టీడీపీ రాష్ట్రం ముఖ్యమంటూ మీడియాతో బాబు కామెంట్
Chandrababu meets Amit shah and nadda in delhi

తన సారథ్యంలోని ఎన్డీయే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తన కూటమిలోని పాత మిత్రులను మళ్లీ దగ్గరకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను మళ్లీ తన పంచకు తెచ్చుకుంది. అలాగే ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం, ఒకప్పటి తన మిత్రపక్షమైన టీడీపీని కూడా కలుపుకుపోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల చర్చలు మొదలయ్యాయి. 

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ పార్టీ పెద్దల మధ్య బుధవారం కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ పార్లమెంటు సమావేశాలు జరగడంతో ఈ మీటింగ్ కాస్తంత ఆలస్యంగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.  రాత్రి 11.25 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు గంట పాటు సాగింది. 

దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీ మధ్య ఈ సమావేశంలో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్‌ షా బాబుతో పేర్కొన్నట్లు సమాచారం. ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామని హోం మంత్రి అన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా వీరి మధ్య రాష్ట్రంలోని పలు విషయాలు చర్చకు వచ్చినట్టు, పొత్తు విషయమై అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. ఏన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి.

ఇక, చంద్రబాబు బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కె. రామ్మోహన్ నాయుడు రఘురామకృష్టరాజు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బీజేపీకి దేశప్రయోజనాలు ముఖ్యమైతే... తెలుగుదేశానికి ఏపీ ప్రయోజనాలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లలో ఏపీ ఎంతో వెనక్కు పోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొద్ది నెలల క్రితమే అమిత్‌ షా తనతో మాట్లాడారని, ఇప్పుడు మళ్లీ కబురు పంపారని చంద్రబాబు తెలిపారు.

More Telugu News