K Kavitha: తక్షణమే కులగణన చేపట్టాలి... అప్పుడే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించవచ్చు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

  • ఆరు నెలల్లో కులగణన పూర్తి చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వవచ్చునని వ్యాఖ్య
  • అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి
  • పూలే విగ్రహ సాధన కోసం ఈ నెల 12న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడి
Kavitha round table meeting on bc rights

కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన ప్రక్రియను చేపట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధన కోసం బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పుడు ప్రారంభిస్తేనే ఆరు నెలల్లో కులగణన పూర్తి చేయవచ్చునన్నారు. అలా అయితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చునని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 24వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అవుతారని కాంగ్రెస్ పార్టీయే చెప్పిందని గుర్తు చేశారు.

స్వాతంత్రానికి ముందు చివరిసారి బీసీ కులగణన జరిగిందని... అప్పుడు 4 వేలకు పైగా బీసీ కులాలు ఉన్నాయని... ఇప్పుడు 2400 వరకు మాత్రమే ఉన్నాయని అంటున్నారని గుర్తు చేశారు. బీసీ కులాల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో అయోమయం నెలకొందన్నారు. బీసీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం రూ.20వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... దీనిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటుకు ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు. పూలే విగ్రహ సాధన కోసం ఈ నెల 12న హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

2018 నుంచి ఇప్పటి వరకు 4365 మంది సివిల్స్‌కు ఎంపికైతే అందులో కేవలం 1195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వచ్చాయన్నారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారన్నారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు 3 శాతం మాత్రమే ఎంపికయ్యారన్నారు. వెనుకబడిన వర్గాలు కోల్పోతున్న రిజర్వేషన్లపై అందరూ స్పందించాలని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించడాన్ని తప్పుబట్టారు.

More Telugu News