Paruchuri Gopalakrishna: తెలుగు ఇండస్ట్రీకి త్రినేత్రం చిరంజీవి: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ఖైదీ' గురించి ప్రస్తావించిన పరుచూరి 
  • ఆ సినిమాకి పనిచేయడం పట్ల ఆనందం 
  • మెగాస్టార్ చేసిన సేవా కార్యక్రమాల ప్రస్తావన 
  • తెలుగు ఇండస్ట్రీకి ఆయన త్రినేత్రమని వ్యాఖ్య

Paruchuri Palukulu

చిరంజీవికి 'పద్మవిభూషణ్' పురస్కారం లభించడం గురించి 'పరుచూరి పలుకులు' ద్వారా పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. చిరంజీవి తన కెరియర్ ఆరంభంలో నెగెటివ్ రోల్స్ ను సైతం పోషించారు. ఆ తరువాత వచ్చిన 'ఖైదీ' ఆయన జీవితాన్ని మార్చేసింది. ఒక సినిమా చరిత్ర సృష్టించడం వేరు ..  ఆ సినిమా చేసిన ఆర్టిస్టు జీవితాన్ని మార్చేయడం వేరు. అలాంటి సినిమాకి పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాము" అని అన్నారు. 

మొన్న జరిగిన పద్మ అవార్డు ఫంక్షన్ కి రమ్మని చిరంజీవిగారు కాల్ చేస్తే వెళ్లాను.  ఒక అత్యున్నతమైన పురస్కారం లభించిన తరువాత వేసే అడుగులు మరింత జాగ్రత్తగా .. ఆదర్శవంతంగా ఉండాలనే ఆయన మాటలు నాకు బాగా నచ్చాయి. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గురించి చిరంజీవి కొన్ని మాత్రమే చెప్పారు. నిజానికి ఆయన ఎన్నో సేవలు చేశారు. ఎవరి సపోర్టు లేకుండా ఆయన ఈ స్థాయిని అందుకోవడం నిజంగా గొప్ప విషయమే" అని చెప్పారు. 

"ఒక్క చిరంజీవిగారు మాత్రమే కాదు .. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ ... శోభన్ బాబు .. వీళ్లంతా ఆ రోజుల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి చరిత్ర సృష్టించారు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్ - ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, నుదుటున మూడో కన్ను చిరంజీవి అని నేను చాలాకాలం క్రితమే చెప్పాను. అదే మాటను మొన్న వేదికపై వెంకయ్య నాయుడు గారు అనడం నన్ను ఆనందాశ్చర్యాలకు గురిచేసింది" అని అన్నారు. 

More Telugu News