PM Kisan: పీఎం కిసాన్ మొత్తం పెంపు అంటూ ప్రచారం... స్పష్టతనిచ్చిన కేంద్రం

  • ప్రస్తుతం ఏడాదికి కేంద్రం నుంచి రైతులకు రూ.6 వేల సాయం
  • మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం
  • ఈ మొత్తాన్ని రూ.12 వేలకు పెంచుతున్నారంటూ ప్రచారం
  • పీఎం కిసాన్ మొత్తం పెంచే ఆలోచన లేదన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి
Union govt gives clarity on PM Kisan amount hike speculations

రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా నగదు బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు పీఎం కిసాన్ పథకం కింద మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.12 వేలకు పెంచుతోందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. 

దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా స్పందించారు. పీఎం కిసాన్ మొత్తం పెంచే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. మహిళా రైతులకు అందించే సాయం కూడా పెంచబోవడం లేదని తెలిపారు. 

పీఎం కిసాన్ కింద దేశంలో 11 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారని, ఇప్పటివరకు 15 విడతల్లో రూ.2.81 లక్షల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేశామని అర్జున్ ముండా వెల్లడించారు. 

పీఎం కిసాన్ కింద ఏపీలో 43 లక్షల మంది, తెలంగాణలో 30 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారని, అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 2.62 కోట్ల మంది పీఎం కిసాన్ లబ్దిదారులు ఉన్నారని కేంద్ర మంత్రి వివరించారు.

More Telugu News