Chelluboyina: అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్.. ఇద్దరూ రాష్ట్రానికి అన్యాయం చేశారు: మంత్రి చెల్లుబోయిన

  • చంద్రబాబు కోసం పవన్ పార్టీ పెట్టారనే విషయం బయటపడిందన్న చెల్లుబోయిన
  • జగన్ ను ఓడిస్తానని పవన్ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శ
  • ప్రజా సంక్షేమాన్ని అందించడంలో జగన్ చరిత్ర సృష్టించారని ప్రశంస
Both Chiranjeevi and Pawan Kalyan deceived AP says minister Chelluboyina

మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు పంచన చేరారని దుయ్యబట్టారు. చిరంజీవి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకునేందుకే జనసేన పార్టీని పవన్ పెట్టారని తాము భావించామని... అయితే, చంద్రబాబు కోసం ఆయన పార్టీ పెట్టారనే విషయం బయటపడిందని చెప్పారు. 

ఎన్టీఆర్ కుటుంబానికి అన్యాయం చేసిన చంద్రబాబుతో పవన్ అంటకాగుతున్నారని విమర్శించారు. పవన్ ఒక నిస్సహాయ రాజకీయ నాయకుడని... ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్న జగన్ ను ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. నారా లోకేశ్ అవినీతిపరుడని గతంలో విమర్శించిన పవన్... ఇప్పుడు వారితోనే కలవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని అందించడంలో జగన్ చరిత్ర సృష్టించారని... పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఎంత మంది కలిసొచ్చినా జగన్ ను ఓడించడం సాధ్యం కాదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News