K Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపైనే కేసు పెట్టాలి: ఎమ్మెల్సీ కవిత

  • మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని వ్యాఖ్య
  • పోలీసులు కేసు నమోదు చేయకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరిక
  • బాల్క సుమన్ పై కేసు పెట్టడాన్ని తప్పుబట్టిన ఎమ్మెల్సీ
BRS Mlc Kalvakuntla Kavitha Tweet On CM Revanth Reddy

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేదంటే తాము కోర్టుకు వెళతామని తెలంగాణ డీజీపీని కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై సోమవారం మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు సెక్షన్ల కింద బాల్క సుమన్ పై కేసు పెట్టారు. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో స్పందించారు.

దళిత బిడ్డ బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. కేసు పెట్టడమే జరిగితే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై నమోదు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన లీడర్ కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తోందని మండిపడ్డారు. ఆకాశంపై ఉమ్మేస్తే అది తిరిగి మీమీదే పడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దంటూ రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

More Telugu News