Harish Rao: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడటం ఏమిటి?: హరీశ్ రావు

  • రేవంత్ రెడ్డి మాటల్లో అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, వితండవాదం... ఇవి తప్ప ఏమీ కనిపించలేదని విమర్శ
  • వెంకయ్య, చిరంజీవి వంటి వారు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు వద్దని సూచించినా అలాగే మాట్లాడారన్న హరీశ్ రావు
  • తెలంగాణ సాధించిన... తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారంటూ ఆగ్రహం
Harish Rao fires at Revanth Reddy for his comments on kcr

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారని... సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం ఏమిటని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు  మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, సంస్కారం లేని భాష, వికారమైన ధోరణి, వితండవాదం... ఇవి తప్ప ఏమీ కనిపించలేదన్నారు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడటం ఏమిటి? అని అందరూ ఆశ్చర్యపోయారన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండవద్దని... విలువలు పెంచేలా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా పలువురు వ్యక్తలు సూచన చేశారని... కానీ వారి సమక్షంలోనే రేవంత్ రెడ్డి దారుణంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ సాధించిన... తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారన్నారు.

తాము ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారని... కానీ అప్పటికే కేఆర్ఎంబీ సమావేశాల్లో మాత్రం అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ప్రాజెక్టులు, ఉద్యోగులను బోర్డు పరిధిలోకి తీసుకు వస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించినట్లు చెప్పారు. ప్రాజెక్టులను అప్పగించినట్లు తాను సొంతంగా చెప్పడం లేదని... కేఆర్ఎంబీ మినట్స్ చెబుతున్నాయన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు దారుణంగా అబద్ధాలు చెబుతున్నారన్నారు.

More Telugu News