Revanth Reddy: కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత... రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్

  • సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ కేఆర్ఎంబీకి అప్పగింత
  • ఇటీవల ఆమోదం తెలిపిన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు
  • బీఆర్ఎస్ నేతలు చేసిన పాపాలను తమపై నెడుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి
  • అసలు దుర్మార్గుడు కేసీఆరేనని వెల్లడి 
  • కేసీఆర్ వల్లే ఏపీకి అధికవాటా పోతోందని ఆరోపణ
Revanth Reddy press meet on KRMB issues

కొన్నిరోజుల కిందట హైదరాబాదులో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం నిర్వహించగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలు, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి అప్పగించాలని ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు అంగీకరించారు. 

ఈ నేపథ్యంలో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై వివరణ ఇచ్చారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసే అంశంలో కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లదే తప్పు అని విమర్శించారు. ఈ ముగ్గురు తాము చేసిన పాపాలు కప్పి పుచ్చి, ఆ పాపాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వంపైకి నెట్టివేసి, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ అంతిమంగా రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి చెందిన రివర్ మేనేజ్ మెంట్ బోర్డులకు స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్-84, 85, 86, 87, 88, 89లతో స్పష్టంగా పేర్కొన్నారని రేవంత్ రెడ్డి వివరించారు. 

ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఈ పునర్ విభజన చట్టాన్ని తానే రాయించానని కేసీఆర్ చెబుతున్నాడు కాబట్టి, ఇప్పుడు ఆయననే సూటిగా ప్రశ్నిస్తున్నాం... 2014లో కేసీఆర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంటులో పునర్ విభజన చట్టం ఆమోదం పొందింది. ఈ చట్టానికి మీరే రచయిత అయినప్పుడు... మీరే కథ, కథనం నిర్వహించినప్పుడు... కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? 

మీరు 2014లో ఎంపీగా ఉన్నప్పుడే ప్రాజెక్టుల అప్పగింతకు పునాదిరాయి పడింది. మీ అనుమతి మేరకు, మీ సూచన మేరకే నాటి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. లోక్ సభలో, రాజ్యసభలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు మీరు కూడా ఈ చట్టానికి ఓట్లు వేసి ఆమోదించారు. ఇవాళ ఈ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుంది అంటే అందుకు బాధ్యులు కేసీఆర్, కేశవరావు. కేసీఆర్ నాడు లోక్ సభలో ఉన్నారు, కేశవరావు రాజ్యసభలో ఉన్నారు. 

కృష్ణా నదీ ప్రాజెక్టుల ద్వారా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించింది 811 టీఎంసీలు.  అయితే, రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని పంపకాలు చేశారు. మరి ఇప్పుడు కృష్ణా నది నీటిలో సగం వాటా కావాలంటున్నవారు అప్పుడెందుకు అడగలేదు? 

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతం, ఏపీలో 32 శాతం ఉంది. ఏ ప్రాంతంలో ఎక్కువ నదీ పరీవాహక ప్రాంతం ఉంటుందో, అంత శాతం ఆ ప్రాంతానికి నీటి కేటాయింపులు ఉండాలని అంతర్జాతీయ విధివిధానాలు చెబుతున్నాయి. ఆ లెక్కన 500 పైచిలుకు టీఎంసీల నీరు తెలంగాణకు, 200 పైచిలుకు టీఎంసీల నీరు మాత్రమే ఏపీకి పోవాలి. కానీ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. 

తెలంగాణకు రావాల్సిన నీటి వాటా రాకుండా, ఆ హక్కులను ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. ఇప్పుడు తెలంగాణకు ఏదైనా నష్టం జరిగితే అందుకు బాధ్యులు కేసీఆర్, హరీశ్ రావు, ఈఎన్సీ మురళీధర్ రావు. నాడు కేఆర్ఎంబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వీళ్లు ఆమోదించడం ద్వారా తెలంగాణకు తీరని నష్టం కలుగజేశారు" అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

More Telugu News