MMTS: 23 ఎంఎంటీఎస్ సహా 51 రైళ్లు రద్దు.. ఫేజ్ 2 పనులే కారణం

  • మౌలాలి - సనత్ నగర్ స్టేషన్ల మధ్య నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనులు
  • ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు టైమ్ టేబుల్ వారీగా రద్దు
  • హైదరాబాద్ - కాగజ్ నగర్ రైలు కూడా..
Total 51 Trains Including MMTS Cancelled Today Onwards Says SCR GM

హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ఫేజ్ - 2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మౌలాలి - సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నెల 4 (ఆదివారం) నుంచి ఈ నెల 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. ఈ రైళ్లను టైం టేబుల్ ప్రకారం రద్దు చేసినట్లు వివరించారు. వీటిలో ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్‌లు, 10వ తేదీ వరకు మరో రెండు, 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. వీటితో పాటు మౌలాలి - అమ్ముగూడ - సనత్ నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, వికారాబాద్‌ - గుంటూరు, రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లను షెడ్యూల్ వారీగా ఆపేస్తామని వివరించారు. 

అందుబాటులోకి రానున్న మరో టెర్మినల్..
హైదరాబాద్ లోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్ ఈ ఏడాది మార్చి చివరినాటికి సిద్ధమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం చెప్పారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య రెండో లైను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ను బైపాస్‌ చేస్తూ కొన్ని రైళ్లను నడిపే అవకాశం కలుగుతుందని వివరించారు.

More Telugu News