Etela Rajender: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది: ఈటల రాజేందర్

  • బీజేపీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న ఈటల
  • రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే బీజేపీతోనే సాధ్యమని నేతలు భావిస్తున్నారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు కాని హామీలుగా మిగిలిపోవచ్చునని జోస్యం
Etala Rajender says Narendra Modi government very safe for country

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీయే సరైన వేదిక అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అన్నారు. తమకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే బీజేపీతోనే సాధ్యమని పలువురు నేతలు భావిస్తున్నారన్నారు. తెలంగాణలో ఇకపై ఉండేది.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రమేనని, బీఆర్ఎస్ కనిపించదన్నారు.

కాంగ్రెస్ పాలనపై కూడా ఈటల స్పందించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలపై తాను ఇప్పుడే మాట్లాడనన్నారు. కానీ గతంలో ఆర్థికమంత్రిగా పని చేసిన అనుభవంతో తనకు తెలిసి... ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు... అమలు కానీ హామీలుగానే మిగిలిపోవచ్చునని జోస్యం చెప్పారు. భవిష్యత్తు బీజేపీదే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో పునాదులు వేసుకున్నామని... ఇకపై తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండా మాత్రమే అన్నారు.

More Telugu News