Pakistan: పాక్‌లో వరుస బాంబు పేలుళ్లు.. ఎన్నికలకు వారమే ఉన్న నేపథ్యంలో కలకలం

  • శుక్రవారం ఎన్నికల ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు
  • బలొచిస్థాన్, ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సుల్లో మితిమీరుతున్న ఉగ్రదాడులు
  • పోలీస్ స్టేషన్లే టార్గెట్‌గా వరుస బాంబు పేలుళ్లు
Pakistan Blast near Election Commission office in Karachi ahead of next weeks general elections

వచ్చే వారం పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. కరాచీలో శుక్రవారం ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో బాంబు పేలడం మరింత కలకలానికి దారి తీసింది. సద్దర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అక్కడి వర్గాలు తెలిపాయి. పోలీసులు ఘటనపై లోతైన దర్యాప్తు ప్రారంభించారు. 

కాగా, బలొచిస్థాన్ ప్రావిన్స్‌లో గురువారం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పోలీస్ స్టేషన్లు, డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలే టార్గెట్‌గా మొత్తం 10 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో ఒకరు మరణించగా ఆరుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఒక పోలీసు అధికారి, జైలు వార్డెన్ ఉన్నారు. ఇక కెట్టాలోని స్పిన్నీ ప్రాంతంలో చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ రహదారి ఫుట్‌పాత్‌పై అమర్చిన బాంబు పేలడంతో ఓ పాదచారి మరణించినట్టు కెట్టా స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు తెలిపారు. 

ఎన్నికలకు వారం రోజులే ఉన్న తరుణంలో పాక్‌లో హింస ప్రజ్వరిల్లుతోంది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దున ఉన్న ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సుల్లో టెర్రరిస్టులు దాడులకు తెగబడుతున్నారు.

More Telugu News