YS Sharmila: ప్రత్యేక హోదా కోసం శరద్ పవార్, సీతారాం ఏచూరిలను కలిసి మద్దతు కోరిన షర్మిల 

  • ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల పోరుబాట
  • నేడు ధర్నా చేపట్టిన పీసీసీ చీఫ్
  • మోదీ, బీజేపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు
  • జాతీయస్థాయి నేతలతో భేటీలు
Sharmila met national leaders to garner support for AP Special Status

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. అనంతరం జాతీయ స్థాయి నేతలను కలిసి ఏపీకి ప్రత్యేక హోదాపై మద్దతు ఇవ్వాలని కోరారు. తన భేటీలకు సంబంధించి షర్మిల సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 

"ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో ఒత్తిడి పెంచేందుకు ఇవాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివలను కలిశాను. ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరాను. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని చెప్పిన మోదీ ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్... ఇలా ఏ ఒక్క హామీ అమలుకు మోదీ ప్రభుత్వం సహకరించలేదు. ప్రత్యేక హోదా కాదు కదా... ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వలేదు. 

బుందేల్ ఖండ్ తరహాలో రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. వైజాగ్-చెన్నై కారిడార్ ను ఏర్పాటు చేయలేదు. ఏపీని బీజేపీ ప్రభుత్వం ఇలా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటే రాష్ట్రంలోని అన్ని పార్టీలు మాత్రం బీజేపీకి బేషరతుగా మద్దతివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది" అంటూ షర్మిల తన ట్వీట్ లో ధ్వజమెత్తారు.

More Telugu News