Revanth Reddy: ఎవడ్రా పడగొట్టేది... మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే పండబెట్టి తొక్కుతాం: రేవంత్ రెడ్డి హెచ్చరిక

  • మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే మూతిపండ్లు రాలుతాయని వార్నింగ్
  • కేసీఆర్ ఆదివాసీల గురించి ఆలోచించారా? అని ప్రశ్న
  • ఎంతసేపూ నీ బిడ్డలు... నీ ఫామ్ హౌస్... తప్ప కేసీఆర్‌కు ప్రజలు పట్టలేదని విమర్శ
  • నిత్యానందస్వామిలా వెళ్లి రాజునని ప్రకటించుకోవాలని ఎద్దేవా
  • మోదీకి అమ్ముకోవడానికి బీఆర్ఎస్ ఎంపీలు గెలుచుకోవాలా? అని నిలదీత
Revanth Reddy warning to BRS leaders

"బీఆర్ఎస్ నాయకులు మా ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు... ఎవడ్రా పడగొట్టేది... పడగొడతామంటే మూతిపండ్లు రాలుతాయ్... పండబెట్టి తొక్కుతాం" అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం హెచ్చరించారు.

"నిన్న, మొన్న వాళ్ల నేతలు (బీఆర్ఎస్) మాట్లాడుతున్నారు... మూడు నెలల్లో.. ఆరు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తామని చెబుతున్నారు... నీ అయ్య ఎవడ్రా పడగొట్టేటోడు.. పడగొడతార్రా... ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నాను.. వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు.. పడగొడితే మీరు చూస్తూ ఉరుకుంటారా... వారిని ఊళ్లలోకి రానిస్తారా? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన చేస్తే మీ ఊళ్లలో వేపచెట్టుకు కోదండం వేసి కొట్టండి...  లాగులో తొండలు విడవండి... ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం... ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తోన్న ప్రభుత్వం... ఇది ప్రజా ప్రభుత్వం.. వాడు అనుకుంటున్నాడు... లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్లు ఈ ప్రభుత్వం కూలుతుందని... నీ అయ్య, నీవు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి గాలి వస్తే కాళేశ్వరం కొట్టుకుపోయింది. కానీ ఈ ప్రభుత్వం గాలి కాదు కదా... నీ ఖాన్‌దాన్ మొత్తం వచ్చినా బోర్లబొక్కల పండబెట్టి తొక్కుతాం... ఎవడన్నా ఈ ప్రభుత్వం పడుతుందని... మూడు నెలలకో... ఆరు నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అంటే మూతిపండ్లు రాలుతాయ్" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

కేసీఆర్ ఆదివాసీల గురించి ఆలోచించారా?

ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పౌరుషం గురించి చెప్పాలంటే కొమురంభీం పేరును ప్రస్తావించాల్సిందే అన్నారు. ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను మేం తీసుకుంటామని నాడే చెప్పామని... ఇప్పుడు ఆ దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటామన్నారు. సమైక్య పాలనలో జరిగిన ఇంద్రవెల్లి ఘటనపై తాను క్షమాపణలు చెప్పానని గుర్తు చేశారు. నాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు అందిస్తున్నట్లు చెప్పారు. కానీ ఆదివాసీల గురించి కేసీఆర్ ఏనాడైనా ఆలోచించారా? కేబినెట్ సమావేశంలో చర్చించారా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ వచ్చిందా? లేక గిరిజన, బలహీనవర్గాల కోసం వచ్చిందా? అని నిలదీశారు. చెరుకు తోటల్లో అడవి పందులు ఎలాగైతే విధ్వంసం చేస్తాయో... కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో అలాగే విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి... తెలంగాణపై భారీ భారం మోపారన్నారు. అడవి బిడ్డలకు మంచినీరు ఇచ్చారా? అని ప్రశ్నించారు. కానీ మల్లు భట్టి విక్రమార్క ఇటీవలే మంచినీటి కోసం నిధులు ఇచ్చారని రేవంత్ చెప్పారు. నిజంగానే కేసీఆర్ అభివృద్ధి చేస్తే మేం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నేను ఆ సన్నాసిని అడుగుతున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తరగతి గదుల కోసం కూడా నిధులు తామే ఇచ్చామన్నారు.

ఎంతసేపూ నీ బిడ్డలేనా?

ఎంతసేపూ నీ బిడ్డలు... నీ ఫామ్ హౌస్... ఆలోచన తప్ప తెలంగాణ సమాజం గురించి ఆలోచించలేదన్నారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చామన్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కవితను ఓడిస్తే వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చావు... అల్లుడికి, కొడుకుకు మంత్రి పదవులు ఇచ్చావు... కానీ యువతకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బిల్లా రంగాలు తమకు ఎన్ని శాపనార్థాలు పెట్టినా...  15 రోజుల్లో 15వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యతను మా మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదని... అప్పుడే ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని సన్నాసులు విమర్శలు చేస్తున్నారని భగ్గుమన్నారు. పేదవాడికి 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? అని బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. మహిళకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? అని నిలదీశారు. గద్దర్ ప్రగతి భవన్‌కు వస్తే ఆయనను ఎండలో నిలబెట్టారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు ఓడించి మీకు బుద్ధి చెప్పారన్నారు.

తాము అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి... ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో అభివృద్ధి చేస్తామన్నారు. ఆ సన్నాసి కోటి ఎకరాలకు నీరు ఇచ్చినట్లు చెప్పారని... కానీ తాను హెలికాప్టర్ నుంచి చూస్తే ఎడారిలా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంకా బావులతోనే వ్యవసాయం చేస్తున్నారని... మనం సాగునీటిని ఇవ్వాలని కొండా సురేఖ చెప్పారన్నారు. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు తప్ప చేసిందేమీ లేదన్నారు.

నిత్యానందస్వామిలా వెళ్లి రాజునని ప్రకటించుకోవాలని ఎద్దేవా

నిత్యానందస్వామిలా కేసీఆర్ తన అక్రమాస్తులతో ఎక్కడో దీవికి వెళ్లి దానికి రాజుగా ప్రకటించుకోవాలి లేదా ఫామ్ హౌస్‌కు రాజుగా ప్రకటించుకోవాలని ఎద్దేవా చేశారు. కానీ మళ్లీ తెలంగాణకు సీఎం అయ్యేది లేదన్నారు. ఆయన పాపాల భైరవుడు అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలను మొత్తం కేసీఆర్ నిలువు దోపిడీ చేశాడని... అలాంటి వ్యక్తి మళ్లీ పదవి కావాలని అడగడానికి సిగ్గుండాలన్నారు.

మోదీకి అమ్ముకోవడానికి బీఆర్ఎస్ ఎంపీలు గెలుచుకోవాలా?

ఆరు నుంచి 8 పార్లమెంట్ స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ చెబుతున్నారని... అంటే వాటిని మోదీకి అమ్ముకోవడానికా? అని ఆరోపించారు. ఇక్కడ ఎంపీలను గెలిచి... మోదీకి అమ్ముకోవడానికి మిమ్మల్ని గెలిపించాలా? అన్నారు. దేశంలో ఉన్నవి రెండే కూటములు అని... ఎన్డీయే కూటమిలో మోదీ, ఇండియా కూటమిలో మేం ఉన్నామని చెప్పారు. కేసీఆర్‌ నీడ కూడా మీ మీద పడనీయమన్నారు. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చి అవతల పారేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఒకటో రెండో సీట్లు గెలిచినా మోదీకి అమ్ముకొని గులాంగిరి చేస్తారని విమర్శించారు. మోదీ, కేడీ ఒక్కటై కాంగ్రెస్ పార్టీని ఓడించాలని భావిస్తున్నారన్నారు. త్వరలో హామీలు అమలు చేస్తామన్నారు.

More Telugu News