jharkhand: హైదరాబాద్ వేదికగా ఝార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం... శామీర్‌పేట రిసార్టుకు తరలింపు

  • హైదరాబాద్ చేరుకున్న 12 మంది జేఎంఎం ఎమ్మెల్యేలు
  • విమానాశ్రయం నుంచి రెండు బస్సుల్లో శామీర్‌పేట రిసార్టుకు తరలింపు
  • ఈ నెల 5న కొత్త ముఖ్యమంత్రి బలనిరూపణ
JMM MLAs reached Hyderabad from Ranchi

ఝార్ఖండ్ జేఎంఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. వారు నిన్ననే రావాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో శుక్రవారం చేరుకున్నారు. రాంచీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న 12 మంది జేఎంఎం ఎమ్మెల్యేలను అటు నుంచి నేరుగా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌కు రెండు బస్సుల్లో తరలించారు.

ఈ నెల 5న ఝార్ఖండ్ అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ కూటమి అప్రమత్తమైంది. ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ చూసుకుంటున్నారు. అసెంబ్లీ బలనిరూపణ వరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు.

More Telugu News