Telangana: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్... 16న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్

  • ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని బంద్‌కు పిలుపునిచ్చిన వాహన సంఘాలు
  • బంద్‌కు బీఆర్టీయూ, సీఐటీయూ, ఎఫ్‌యూటీయూ, ఐఎఫ్‌టీయూ, టీఏటీయూ మద్దతు
  • ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్
Auto band in Telangana on February 16

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలంటూ ఫిబ్రవరి నెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌కు వాహన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు తెలంగాణ మోటార్ ట్రాన్సుపోర్ట్ వెహికిల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బుధవారం రవాణా శాఖ కమిషనర్‌ను కలిసి సమ్మె నోటీసును అందించారు. రవాణా రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.

బంద్‌కు బీఆర్టీయూ, సీఐటీయూ, ఎఫ్‌యూటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాలు మద్దతు తెలిపాయని టీఏటీయూ ఆటో యూనియన్‌ తెలిపింది. ఉచిత బస్సు కారణంగా తెలంగాణలో ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమయ్యాయని... వారిని ప్రభుత్వం ఆదుకోవాలని టీఏటీయూ డిమాండ్ చేసింది. రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా చితికిపోయినందున వారికి నెలకు రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

More Telugu News