Panjagutta PS: పంజాగుట్ట పీఎస్ సిబ్బంది అందరినీ బదిలీ చేసిన సీపీ

  • ఎస్ఐ నుంచి హోంగార్డు దాకా 85 మంది ట్రాన్స్ ఫర్
  • సిటీ ఆర్మ్ డ్ రిజర్వు కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
  • కొత్తగా 82 మందిని నియమించిన సీపీ శ్రీనివాస్ రెడ్డి
  • గత ప్రభుత్వంలోని పెద్దలకు సమాచారం లీక్ చేస్తున్నారనే నిర్ణయం..!
Panjagutta Police Station Total Staff Transferred By CP Srinivas Reddy

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐల నుంచి హోంగార్డుల దాకా మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ సిటీ ఆర్మ్ డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. వారి స్థానంలో ప్రస్తుతం 82 మందిని నియమించారు. పంజాగుట్ట పీఎస్ లో సిబ్బంది మొత్తాన్ని ఒకేరోజు బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

హైదరాబాద్ సిటీలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన పరిణామాలపై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కేసుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడం, మాజీ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలపై విమర్శలు వ్యక్తం కావడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని పెద్దలకు ఈ స్టేషన్ నుంచి సమాచారం లీకవుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఒకే పోలీస్‌స్టేషన్‌ నుంచి 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి అని అధికార వర్గాలు తెలిపాయి.

More Telugu News