G Jagadish Reddy: అదే జరిగితే కాంగ్రెస్ పాలకులు ఢిల్లీలో తలదాచుకోవాలి: కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి విమర్శలు

  • కాంగ్రెస్ అరాచకాలపై గులాబీ దండు తిరగబడితే పాలక కాంగ్రెస్ పక్షం పత్తా దొరకకుండా పోతుందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ నాయకులు దాడులతో రెచ్చిపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక
  • అధికారం ఉందని అహంకారంతో ప్రవర్తిస్తే తెలంగాణ సమాజం ఉపేక్షించేది లేదన్న జగదీశ్ రెడ్డి
  • కేసులు పెడతామంటూ మాట్లాడే ఉడత ఊపులకు.. కుక్క అరుపులకు భయపడేది లేదన్న మాజీ మంత్రి
  • కేసీఆర్ నాయకత్వంలో పని చేసిన వారికి మాత్రమే పాలన అనుభవం ఉంటుందని వ్యాఖ్య
Jagadish Reddy hot comments on Congress leaders

కాంగ్రెస్ అరాచకాలపై గులాబీ దండు తిరగబడితే పాలక కాంగ్రెస్ పక్షం పత్తా దొరకకుండా పోతుందని... అదే జరిగితే కాంగ్రెస్ పాలకులు ఢిల్లీలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ నాయకులు దాడులతో రెచ్చిపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇటీవల సూర్యాపేట, తాజాగా భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిలపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందని అహంకారంతో ప్రవర్తిస్తే తెలంగాణ సమాజం ఉపేక్షించేది లేదన్నారు.

నిజాంలను తరిమిన గడ్డ తెలంగాణ అని గుర్తుంచుకోవాలన్నారు. అంతకంటే కాంగ్రెస్ పాలకులు ఎక్కువేం కాదన్నారు. కేసులు పెడతామంటూ కొంతమంది బెదిరిస్తున్నారని... కానీ వారి ఉడత ఊపులకు, కుక్క అరుపులకు భయపడేవారు లేరన్నారు. మీరు ఆంధ్రాబాస్ వద్ద మోకరిల్లిన రోజున... కేసీఆర్ తెలంగాణ సాధించారని... ఆయన నేతృత్వంలోని గులాబీ దండును ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పైసలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పాలకులకు పాలన చేతకాదన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటారన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో పని చేసిన వారికి మాత్రమే పాలన అనుభవం ఉంటుందన్నారు. చంద్రబాబు చెప్పులు మోసిన వారికి... వైఎస్ బూట్లు నాకిన వారికి పాలన అనుభవం ఎక్కడిది? అని ఘాటుగా విమర్శించారు. రుణమాఫీ చేయమన్నది కాంగ్రెస్ పార్టీయేనని... కానీ ఇప్పుడు రుణమాఫీ గురించి అడిగితే చెప్పులతో కొట్టండి... కాలర్ పట్టి నెట్టండి అని మంత్రులు మాట్లాడటం విడ్డూరమన్నారు.

More Telugu News