Harish Rao: వంట అయ్యాక గరిటె తిప్పినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు: హరీశ్ రావు చురక

  • స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంపై మాజీ మంత్రి విమర్శలు
  • బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తే కాంగ్రెస్ నియామక పత్రాల జారీ పేరిట హడావుడి చేస్తోందని విమర్శ
  • ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్న
Harish Rao fires at congress government

స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం 'వంట అయ్యాక గరిటె తిప్పినట్లు'గా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే, తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తుండటం దౌర్భాగ్యమన్నారు. ఫిబ్రవరి 1, 2024 న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని పత్రికల సాక్షిగా ప్రచారం చేసిన కాంగ్రెస్, దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తోందన్నారు. చేయని పనులకు డబ్బా కొట్టుకోవడానికి బదులు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని సూచించారు.

తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేర్చే లక్ష్యంలో భాగంగా పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తమ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది రిక్రూట్మెంట్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2023 జూన్ 22న 1,890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగినట్లు చెప్పారు. 2023 ఆగస్ట్ 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి, తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చిందని... దీంతో తుది ఫలితాల విడుదలకు ఆటంకం కలిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావుడి చేస్తోందని విమర్శించారు. స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటోందన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదించి, అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా, ఏడాదిలోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు విడుదల చేసిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్, ఏప్రిల్ 1న గ్రూప్ 2, జూన్ 1న గ్రూప్ 3, 4 నియామకాలకు నోటిఫికేషన్, మార్చి1న పోలీసు సహా తరహా యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఎదురుచూస్తున్న ఉద్యోగ అభ్యర్థులకు, విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.   
 
నర్సింగ్ ఆఫీసర్లకు శుభాకాంక్షలు..

స్టాఫ్ నర్సులుగా ఎంపికై బుధవారం నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మన్ననలు పొందేలా అత్యుత్తమ సేవలందించి, ఉద్యోగంలో రాణించాలని ఆకాంక్షించారు. మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్సార్బీ)ని అభినందించారు. తమ ప్రభుత్వం నర్సుల సేవలను గుర్తించి, వారి గౌరవాన్ని మరింత పెంచేలా వృత్తి పేరును ఉన్నతీకరించిందని హరీశ్ రావు అన్నారు.

స్టాఫ్ నర్స్‌ని నర్సింగ్ ఆఫీసర్‌గా, హెడ్ నర్స్‌ని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా, హెడ్ నర్స్‌ని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. నర్సు పోస్టుల పేరును తమ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసి ఉన్నతీకరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్టాఫ్ నర్సులుగా పరిగణించడం శోచనీయమన్నారు.

More Telugu News