Nara Lokesh: నారా లోకేశ్ సమక్షంలో భారీ సంఖ్యలో టీడీపీలో చేరిన మంగళగిరి వైసీపీ నేతలు

  • మంగళగిరి నియోజకవర్గంలో కీలక పరిణామం
  • భారీగా టీడీపీలో చేరికలు
  • పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన లోకేశ్
Mangalagiri YCP leaders joins TDP

మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైసీపీకి చెందిన నేతలు నేడు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆదర్శ మంగళగిరికి అందరూ కలసిరావాలని లోకేశ్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. 

ఇవాళ దుగ్గిరాల మండలానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్యనేతలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. 

వైసీపీ సీనియర్ నేత, కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా 14 ఏళ్ల పాటు పనిచేసిన చిలువూరుకు చెందిన జడ్పీటీసీ యడ్ల వెంకట్రావు, చిలువూరు గ్రామ మాజీ సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘ మాజీ అధ్యక్షురాలు, మాజీ జడ్పీటీసీ యేళ్ల జయలక్ష్మి, పెదపాలెం సర్పంచ్, దుగ్గిరాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, గత 18 సంవత్సరాలుగా దుగ్గిరాల సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్న వైసీపీ నాయకుడు పాటిబండ్ల హరిప్రసాద్, పెనుమూలి సర్పంచ్ కొరిటాల పద్మావతి, మాజీసర్పంచ్, దుగ్గిరాల సొసైటీ చైర్మన్ కొరిటాల సురేశ్, తుమ్మపూడికి చెందిన వైసీపీ ముఖ్యనాయకుడు వాసిరెడ్డి లీలాప్రసాద్ నేడు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. 

పేరుకలపూడి, శృంగారపురం, కేఆర్ కొండూరు, వీర్లపాలెం, గొడవర్రు, పెదకొండూరు, తుమ్మపూడి గ్రామాలకు చెందిన ముఖ్యనేతలు వారి అనుచరులతో కలిసి లోకేశ్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. 

పార్టీలో చేరిన ప్రముఖుల్లో చిలువూరుకు చెందిన కాలవ శంకర్, కట్టా రాము, పాలపర్తి సాయి, ఎన్.దుర్గారావు, కురగంటి బుజ్జి, పెదపాలెంకు చెందిన మాజీ సర్పంచ్ బుల్లా శిఖామణి, నలకుదిటి పిచ్చయ్య, రాజగోపాలం, నిరంజన్, జముడిగాని భుజంగరావు, శ్రీరామ్మూర్తి, దాడిగ గోపి, పెనుమూలికి చెందిన ఎస్ కె జానీ, రహంతుల్లా, చెలంచెర్ల సాంబశివరావు, తోకల బాలాజీ, ఏసం శ్రీనివాసరావు, ఎం దుర్గారావు, ఎస్ కె ఖాదర్ బాషా, పోపూరి బాలస్వామి ఉన్నారు. తుమ్మపూడికి చెందిన బి. రామదాసు, పోపూడి బాలస్వామి తదితరులు కూడా టీడీపీలో చేరారు. 

ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త నందం అబద్దయ్య, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

యుద్ధం గెలుపు కోసం కాదు... భారీ మెజారిటీ కోసం: నారా లోకేశ్


పార్టీలో చేరికల సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడారు. మంగళగిరిలో ఓడిపోయి తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని వెల్లడించారు. ఓటమి తరువాత తన
లో కసి పెరిగిందని అన్నారు. 

నేను కంచుకోటలో నిలబడి కాలర్ ఎగరేసే రకం కాదు... టీడీపీ జెండా ఎగరని చోట భారీ మెజారిటీతో గెలవడమే నా లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని చెప్పారు. కొత్త, పాత అంతా కలిసి పనిచేయాలి అని లోకేశ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

"సీనియర్లను గౌరవిస్తా... పని చేసే వారిని ప్రొత్సహిస్తా. మంగళగిరిలో గెలుపు కోసం కాదు.. మెజార్టీ కోసం పని చేయాలి. మంగళగిరిలో నేను ఓడిపోయినప్పుడు... ఉత్తరాంధ్ర వెళ్లి పోటీ చేయండి, ఇంపాక్ట్ ఉంటుందని ఎంతో మంది చెప్పారు. కానీ నాకు మంగళగిరి ప్రజలతో అనుబంధం ఏర్పడింది అందుకే ఇక్కడ నుండి పోటీ చేసి భారీ మెజారిటీ తో గెలవాలి అని పనిచేస్తున్నా. 

వచ్చే 72 రోజులు చాలా ముఖ్యం.. పట్టు విడవకుండా అంతా పని చేయాలి. భారీ మెజారిటీతో గెలిస్తేనే మంగళగిరిని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెయ్యడానికి అవకాశం వస్తుంది" అని లోకేష్ అన్నారు. 

More Telugu News