AP Aarogyasri: ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ.. కడపలో 17 ఆసుపత్రులపై చర్యలు

  • ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించని ప్రభుత్వం
  • నిన్నటి నుంచి సేవలను ఆపేసిన ఆసుపత్రులు
  • పలు ఆసుపత్రుల లైసెన్స్ లను డీలిస్టు చేసిన ప్రభుత్వం
AP hospitals stopped Aarogyasri services

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రూ. 1,200 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. బకాయిలు విడుదల చేయాలని, పలు శస్త్ర చికిత్సల ఛార్జీలను పెంచాలని కోరుతూ ప్రభుత్వాన్ని నెట్ వర్క్ ఆసుపత్రులు కోరుతున్నప్పటికీ స్పందన రాలేదు. గత 20 రోజులుగా చర్చలు జరుపుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూలమైన హామీ రాలేదు. దీంతో, ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు నిన్నటి నుంచి నిలిపివేశాయి. 

జగన్ సొంత జిల్లా కడపలో కూడా ప్రభుత్వానికి ఆసుపత్రుల యాజమాన్యాలు షాక్ ఇచ్చాయి. కడపలోని 18 ఆసుపత్రులకు గాను 17 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసినట్టు బోర్డులు పెట్టాయి. దీంతో ఆ ఆసుపత్రులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారనే కారణంతో... సదరు 17 ఆసుపత్రులను డీలిస్టు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాజమండ్రిలో 14, విశాఖలో నాలుగు ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సస్పెండ్ చేసింది.

More Telugu News