Mamata Banerjee: కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన

  • లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్లా టీఎంసీ పోటీ చేస్తుందని వెల్లడి
  • ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న దీదీ
  • ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలలో ఒకటిగా వ్యవహరించిన టీఎంసీ
Mamata Banerjee To Fight Alone In Bengal

ఇండియా కూటమిలో కొనసాగే విషయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం సంచలన ప్రకటన చేశారు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతామని స్పష్టం చేశారు. బెంగాల్ లోని 42 లోక్ సభ నియోజకవర్గాల్లో టీఎంసీ పోటీ చేస్తుందని వివరించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులపై, ఇండియా కూటమి గురించి ఆలోచిస్తామని మమతా బెనర్జీ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపైనా దీదీ విమర్శలు గుప్పించారు. బెంగాల్ లోకి యాత్ర ఎంటర్ కాబోతోందని గుర్తుచేస్తూ కూటమి భాగస్వామిగా ఉన్న తమకు మర్యాదపూర్వకంగా కూడా సమాచారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. దీంతో రాహుల్ గాంధీ యాత్రలో మమత పాల్గొనడం సందేహాస్పదంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా మెజారిటీ ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. బీజేపీపై ఐక్యంగా పోరాడాలనే నిర్ణయంలో భాగంగా ఈ కూటమి ఏర్పడింది. కూటమిలోని ప్రధాన పార్టీలలో ఒకటిగా టీఎంసీ వ్యవహరించింది.

పలుమార్లు చర్చల అనంతరం కూటమిలో ప్రస్తుతం సీట్ల పంపకాలపై కసరత్తు జరుగుతోంది. ఈ విషయంలోనే కాంగ్రెస్, టీఎంసీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బెంగాల్ లో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉండగా.. ఏ పార్టీ ఎన్నిచోట్ల పోటీ చేయాలనే విషయంపై ఇరుపార్టీల నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్, టీఎంసీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు సీట్లను మమత ఆఫర్ చేశారని, మరిన్ని సీట్లు కావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలతోనే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తాజా ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News