Virat Kohli: కోహ్లీ స్థానంలో ఆడేది ఆ ముగ్గురిలో ఎవరో...!

  • ఈ నెల 25 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్
  • తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం
  • త్వరలో మరో ఆటగాడ్ని ఎంపిక చేస్తామన్న బీసీసీఐ
  • రేసులో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, ఛటేశ్వర్ పుజారా
Who will get the chance after Kohli absence

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ విరామం కోరడంతో బీసీసీఐ అందుకు అంగీకరించింది. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడ్ని త్వరలోనే ఎంపిక చేస్తామని బోర్డు వెల్లడించింది. 

కాగా, కోహ్లీ స్థానంలో ఎవర్ని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఎందుకంటే, టీమిండియాలో ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉంది. ఒక్క స్థానం కోసం అనేకమంది ఆటగాళ్లు కాచుకుని ఉన్నారు. ఇక, కోహ్లీ ఆడేది వన్ డౌన్ లో కాబట్టి ఆ స్థానానికి గట్టిపోటీయే ఉంది. ఈ స్థానం కోసం యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్ లతో పాటు సీనియర్ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా కూడా రేసులో ఉన్నాడు. 

ఇంగ్లండ్ బలమైన జట్టు కాబట్టి, సీనియర్ ఆటగాడి అవసరం ఉందని సెలెక్టర్లు భావిస్తే పుజారా పునరాగమనం ఖాయమైనట్టే. అలాకాకుండా, భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే... సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్ లలో ఒకరికి చాన్స్ లభించవచ్చు. 

లేకపోతే, ఇప్పటికే జట్టుకు ఎంపికైనవారిలో ఒకరికి చాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సర్ఫరాజ్ ఖాన్: ప్రస్తుతం భారత్ లో ఇంగ్లండ్-ఏ జట్టు కూడా పర్యటిస్తోంది. ఈ జట్టు ఇండియా-ఏ జట్టుతో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఇండియా-ఏ తరఫున ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ఒక మ్యాచ్ లో 96, మరో మ్యాచ్ లో 55 పరుగులు చేసి తన ఫామ్ ను చాటుకున్నాడు. గత కొంతకాలంగా జాతీయ జట్టులో స్థానం కోసం తీవ్రంగా పోరాడుతున్న వారిలో సర్ఫరాజ్ ఒకడు. గత మూడు రంజీ సీజన్లలో వరుసగా అతడి సగటు 154, 122, 91. దీన్నిబట్టే అతడెంత భీకర ఫామ్ లో ఉన్నాడో అర్థమవుతుంది. 2020 నుంచి దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత నిలకడ కనబర్చుతున్న ఆటగాడు సర్ఫరాజే. ఇప్పటికైనా కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో సర్ఫరాజ్ కు అవకాశం దక్కుతుందేమో చూడాలి. 


రజత్ పాటిదార్: ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు గత రెండేళ్లుగా టీమిండియా వన్డే జట్లకు ఎంపికవుతున్నాడు. పెద్దగా ఆడే అవకాశాలు రావడంలేదు కానీ ప్రతిభకు మాత్రం లోటు లేదు. ఐపీఎల్ చూసినవాళ్లకు రజత్ పాటిదార్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంగ్లండ్-ఏ జట్టుతో ఆడిన ఇండియా-ఏ జట్టులో పాటిదార్ కూడా సభ్యుడే. గత రెండు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు (151, 111) చేసిన ఈ యువ ఆటగాడు టీమిండియా టెస్టు జట్టులో స్థానం కోసం తహతహలాడుతున్నాడు. అటు పేస్, ఇటు స్పిన్ రెండింటినీ సమర్థంగా ఆడగలిగే సత్తా పాటిదార్ సొంతం. 

ఛటేశ్వర్ పుజారా: 35 ఏళ్ల ఈ వెటరన్ బ్యాట్స్ మన్ గురించి పరిచయం అక్కర్లేదు. రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత మిస్టర్ డిపెండబుల్ అనిపించుకున్నాడు. టెస్టుల్లో భారత్ కు స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా పేరుపొందాడు. అయితే అనూహ్య రీతిలో ఇటీవల పుజారాను సెలెక్టర్లు ఎంపిక చేయడంలేదు. దాంతో మళ్లీ రంజీ క్రికెట్ ఆడుతున్న పుజారా జాతీయ జట్టులో స్థానం కోసం శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాడు. ఇటీవల ఝార్ఖండ్ పై ఓ డబుల్ సెంచరీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

More Telugu News