Virat Kohli: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ

  • జనవరి 25 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్
  • ఐదు టెస్టులు ఆడనున్న ఇరు జట్లు
  • తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం
  • వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పుకున్నాడన్న బీసీసీఐ
Virat Kohli opted out for first two tests against England

ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత కారణాలతో స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. 

జనవరి 25 నుంచి టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జరగనుంది. తొలి టెస్టుకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిలవనుంది. రెండో టెస్టుకు విశాఖలోని ఏసీఏ మైదానం ఆతిథ్యమిస్తోంది. 

ఈ రెండు టెస్టుల్లో కోహ్లీ ఆడడంలేదని బీసీసీఐ నేడు ఒక ప్రకటనలో వెల్లడించింది. అందుకు గల కారణాలను మాత్రం ప్రత్యేకించి పేర్కొనలేదు. కోహ్లీ విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కోహ్లీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేసేదీ త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ పేర్కొంది. 

తొలి రెండు టెస్టులకు తాను దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు కోహ్లీ ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మకు, టీమిండియా మేనేజ్ మెంట్ కు తెలియజేశాడని వివరించింది. కోహ్లీ వ్యక్తిగత కారణాలతోనే తొలి రెండు టెస్టులు ఆడడంలేదని, మీడియా దీనిపై ఊహాగానాలు ప్రచారం చేయరాదని బీసీసీఐ కోరింది.

More Telugu News