Lavanya Tripathi: అయోధ్యలో జన్మించిన లావణ్య త్రిపాఠి.. వేడుక రోజున ప్రత్యేక జువెలరీలో సినీ నటి

  • అయోధ్యలో జన్మించిన లావణ్య త్రిపాఠి
  • ఈనాటి వేడుకను వీక్షించడం అదృష్టమని వ్యాఖ్య
  • యావత్ దేశ ప్రజలకు అనిర్వచనీయ అనుభూతి అన్న లావణ్య
Lavanya Tripathi wears Ram parivar jewellery

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా సినీ నటి, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. లావణ్య త్రిపాఠి జన్మస్థలం అయోధ్యనే కావడం గమనార్హం. అయోధ్య వేడుక సందర్భంగా ఆమె రామ్ పరివార్ డిజైన్ నగలను ధరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

అయోధ్యలో జన్మించిన వ్యక్తిగా... ఈనాటి వేడుకను వీక్షించడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆమె అన్నారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను వీక్షించడం తనకే కాక, యావత్ దేశ ప్రజలకు అనిర్వచనీయమైన అనుభూతి అని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె రామ్ పరివార్ నగలను ధరించడం ఈ అపూర్వ సందర్భానికి మరింత శోభను తీసుకొచ్చినట్టయింది. అయోధ్య కార్యక్రమం ప్రజలందరినీ ఒకచోటుకు చేర్చిందని చెప్పారు. పూర్తిగా భక్తితో నిండిపోయిన మన హృదయాలతో దేశ శాంతి కోసం ప్రార్థిద్దామని అన్నారు.

More Telugu News