KS Bharat: ఇంగ్లండ్ లయన్స్ పై సెంచరీ చేసి అయోధ్య రాముడికి అంకితం ఇచ్చిన తెలుగుతేజం కేఎస్ భరత్

  • అహ్మదాబాద్ లో ఇండియా-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య మ్యాచ్
  • కేఎస్ భరత్ వీరోచిత సెంచరీ
  • భరత్ సెంచరీతో మ్యాచ్ లో ఓటమి తప్పించుకున్న భారత్
  • భరత్ సెంచరీ సెలబ్రేషన్ వీడియో వైరల్
KS Bharat dedicates his century to Lord Rama

ప్రస్తుతం ఇంగ్లండ్ లయన్స్ (ఇంగ్లండ్-ఏ) జట్టు భారత్ లో పర్యటిస్తోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఏ, ఇంగ్లండ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో తెలుగుతేజం, ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎస్ భరత్ వీరోచిత సెంచరీ చేయడం విశేషం. 

రెండో ఇన్నింగ్స్ లో 490 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్-ఏ జట్టు ఓ దశలో ఓటమిదిశగా పయనిస్తున్నట్టు కనిపించింది. అయితే భరత్ అద్భుత పోరాటపటిమ కనబర్చి జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. ఆరో వికెట్ కు మానవ్ సుతార్ తో కలిసి అజేయంగా 207 పరుగులు జోడించాడు. 

భరత్ 165 బంతుల్లో 116 పరుగులు చేశాడు. కాగా, సెంచరీ పూర్తి కాగానే భరత్ తన బ్యాట్ ను విల్లుగా మార్చి బాణం సంధిస్తున్నట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తద్వారా తన సెంచరీని అయోధ్య రాముడికి అంకితం ఇస్తున్నట్టుగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News