Parthasarathi: సొంత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

  • పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా మంత్రి జోగి రమేశ్
  • తీవ్ర అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి 
  • త్వరలో టీడీపీలోకి పార్థసారథి!
YCP MLA Parthasarathi comments on govt

వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సొంత పార్టీపై గుర్రుగా ఉన్నారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెనమలూరు నియోజకవర్గం ఇన్చార్జిగా మంత్రి జోగి రమేశ్ ను తీసుకురావడం ఆయనలో అసంతృప్తిని రగిల్చింది. అప్పటినుంచి, ఎక్కడికక్కడ వైసీపీ అధిష్ఠానం తీరును ఎండగడుతున్నారు. 

తాజాగా పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వానికి మార్పులు చేర్పులు అలవాటుగా మారిపోయాయని, గంటగంటకు విధానాలు మార్చుకునే చెడు అలవాటు వచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం సేకరణలోనూ ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానాలతో రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రైతులకు ఇబ్బందికరంగా మారాయని అన్నారు. 

మంత్రులు బూతులు తిట్టడం మాని రైతుల సమస్యలపై సమీక్షలు పెట్టాలని పార్థసారథి హితవు పలికారు. కాగా, పార్థసారథి త్వరలోనే టీడీపీలో చేరతారని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అయోధ్య వెళ్లి వచ్చాక పార్థసారథి పసుపు కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.

More Telugu News