Jagan: విజయవాడలో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

  • విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ భారీ విగ్రహం
  • విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన ఏపీ సీఎం జగన్
  • ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని వెల్లడి  
CM Jagan unveils 125 feet Ambedkar statue in Vijayawada

విజయవాడ స్వరాజ్య మైదాన్ లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడానికి అంబేద్కరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. 

విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోని ఇతర అంబేద్కర్ విగ్రహాలన్నింటి కంటే పెద్దది అని వెల్లడించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కు ఇకపై విజయవాడ చిరునామాగా మారుతుందని పేర్కొన్నారు. 

ఈ మహా విగ్రహం అందరికీ స్ఫూర్తిదాయకం అని, కానీ పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని సీఎం జగన్ విమర్శించారు. అంబేద్కర్ భావజాలం పెత్తందార్లకు నచ్చదని అన్నారు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదని విమర్శించారు.

పూర్తిగా మేడిన్ ఇండియా


విజయవాడలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా స్వదేశీ వస్తువులతోనే రూపొందించారు. ఇందుకోసం రూ.404.35 కోట్లు ఖర్చు చేశారు. 18.18 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టు నిర్మించారు. దీంట్లో అంబేద్కర్ పీఠం 81 అడుగులు కాగా, ప్రధాన విగ్రహం 125 అడుగుల ఎత్తు ఉంటుంది. పీఠంపై జీ ప్లస్ 2 తరహాలో గదులు నిర్మించారు. పీఠాన్ని బౌద్ధ మత కాలచక్ర మహామండపం తరహాలో తీర్చిదిద్దారు. ఇక్కడ అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, రెండు వేల మంది సామర్థ్యంతో కూడిన కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది.

More Telugu News