ఎన్టీఆర్ వల్లే చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా రాణిస్తున్నారు: రేణుకా చౌదరి

  • ఎంతో మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్న రేణుక
  • ఖమ్మంకు తనను దూరం చేయవద్దన్న ఫైర్ బ్రాండ్
  • టీడీపీ మద్దతుతోనే బీఆర్ఎస్ ను తరిమేశామని వ్యాఖ్య
ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి రాణిస్తున్నారంటే అది దివంగత ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యమని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ... అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ బతికి ఉందంటే అది ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణ వల్లే అని చెప్పారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనలాంటి ఎంతో మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు. తన పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుక అని ఎన్టీఆర్ అనేవారని గుర్తు చేసుకున్నారు. 

తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డనని, తనకు కొత్తకొత్త బిరుదులు ఇచ్చి ఈ ప్రాంతానికి దూరం చేయవద్దని రేణుక కోరారు. రాజకీయాల్లో గోడలు మారొచ్చు కాని, పునాదులు మారవని చెప్పారు. టీడీపీ మద్దతుతోనే పదేళ్లుగా రాక్షస పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ను ఇంటికి తరిమామని అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.


More Telugu News

Renuka Chowdary Congress Revanth Reddy NTR Chandrababu Telugudesam