Gudivada: ఎన్టీఆర్ వర్ధంతి.. గుడివాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. హై టెన్షన్!

  • ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ భారీ బహిరంగసభ
  • టీడీపీకి పోటీగా కొడాలి నాని కార్యక్రమాలు
  • పోటాపోటీగా వెలసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు
High tension in Gudivada on NTR vardhanti day

టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 'రా.. కదలిరా' పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇరు వర్గాలు గుడివాడలో పోటాపోటీగా పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 

ఉదయం 11 గంటలకు కొడాలి నాని బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఫొటోలు లేకుండానే టీడీపీకి పోటీగా నాని ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. 

టీడీపీ విషయానికి వస్తే... మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పిస్తారు. ఈ సందర్భంగా పీ4లో భాగంగా దారిద్ర్య నిర్మూలనపై రూపొందించిన ఒక పత్రాన్ని ఆయన విడుదల చేస్తారు. అనంతరం గుడివాడ సభలో ఆయన పాల్గొంటారు.

More Telugu News