Suhasini: శోభన్ బాబుగారి వీడియో చూడగానే కన్నీళ్లు వచ్చాయి: సుహాసిని

  • శోభన్ తో ఎక్కువ సినిమాలు చేశానన్న సుహాసిని  
  • తమది హిట్ కాంబినేషన్ అని వ్యాఖ్య 
  • ఆయనతో నటించడం అదృష్టమని వివరణ 
Suhasini Interview

నిన్నటితరం అందమైన కథానాయికలలో సుహాసిని ఒకరు. ప్రస్తుతం ఆమె తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను నాగార్జునగారితో ఒక సినిమా .. వెంకటేశ్ గారితో ఒక సినిమా చేశాను. చిరంజీవిగారు .. బాలకృష్ణగారితో ఎక్కువ సినిమాలు చేశానని అంతా అనుకుంటారు. కానీ నేను శోభన్ బాబుగారితో ఎక్కువ సినిమాలు చేశాను" అన్నారు. 

"శోభన్ బాబుగారితో 12 నుంచి 15 సినిమాల వరకూ చేశాను. భార్యాభర్తలు .. బావ మరదళ్లు .. మహారాజు .. కొంగుముడి ... జాకీ .. ఇలా చాలా వరకూ మా కాంబినేషన్లో హిట్లు పడ్డాయి. షూటింగు సమయంలో ఆయన చాలా సరదాగా ఉండేవారు. నేను కాస్త మోడ్రన్ గా ఉంటాననే ఆలోచనలో ఆయన ఉండేవారు. అందువలన అన్ని విషయాలు అడిగి తెలుసుకునేవారు" అని చెప్పారు.

"ఈ మధ్య .. ఈ జనరేషన్ లో శోభన్ బాబు గారు ఉంటే .. ఇలా ఉండేవారంటూ ఏఐ టెక్నాలజీతో వచ్చిన ఓ వీడియో ఇటీవల చూశాను. ఆ వీడియో చూడగానే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. ఆయన ఇప్పుడు ఉంటే అలాగే ఉండేవారేమో అనిపించింది. నిజంగానే ఆయన చాలా హ్యాండ్సమ్ .. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాంటి ఆయనతో కలిసి నటించడం నా అదృష్టంగానే భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News