YS Sharmila: పీసీసీ చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: షర్మిల

  • ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం
  • కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకొస్తానని ప్రకటన
  • ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేస్తానని వెల్లడి
Sharmila responds on being appointed as AP PCC Chief

వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి, తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల అనూహ్య రీతిలో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా బరిలో దిగకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ విజయం సాధించడం, షర్మిల కాంగ్రెస్ లో చేరడం, తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తెలిసిందే. ఇవాళ, షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు.

"ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా నేను మాణికం ఠాగూర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి చేయి చేయి కలిపి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అంతేకాదు, మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు, రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలందరి మద్దతును కోరుకుంటున్నాను. వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

More Telugu News