Team India: దూబే మళ్లీ కొట్టాడు... జైస్వాల్ మెరుపులు.... టీమిండియా ఘనవిజయం

  • రెండో టీ20లోనూ టీమిండియానే విన్నర్
  • 173 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో ఛేదించిన భారత్
  • 32 బంతుల్లోనే 63 పరుగులు చేసిన శివమ్ దూబే
  • 34 బంతుల్లో 68 పరుగులు సాధించిన జైస్వాల్
  • సిక్సర్ల మోత మోగించిన యువ ఆటగాళ్లు
  • 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
Team India clinches series against Afghanistan

యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్న వేళ టీమిండియాను వరుసగా రెండో విజయం వరించింది. ఇవాళ ఇందోర్ లో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

తొలి టీ20లో సత్తా చాటిన శివమ్ దూబే నేటి మ్యాచ్ లోనూ విధ్వంసం సృష్టించాడు. దూబే కేవలం 32 బంతుల్లో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ స్కోరులో 5 ఫోర్లు, 4 భారీ సిక్సులు ఉన్నాయి. ఆఫ్ఘన్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉతికారేశాడు. 

అంతకుముందు, టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0) ఆడిన తొలి బంతికే డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ, కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగుల మోత మోగించాడు. జైస్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. 

వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 5 ఫోర్లతో చకచకా 29 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో కరీం జనత్ 2, నవీనుల్ హక్ 1, ఫజల్ హక్ ఫరూఖీ 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ విజయంతో టీమిండియా 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక, నామమాత్రమైన మూడో మ్యాచ్ జనవరి 17న బెంగళూరులో జరగనుంది.

More Telugu News