G. Kishan Reddy: రైల్వే నెట్ వర్క్ శరవేగంగా కొనసాగుతోంది.. కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నాం: కిషన్ రెడ్డి

  • రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందని ఆశాభావం
  • మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిందన్న కిషన్ రెడ్డి
  • సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రపంచంలో మొదటిసారి స్వదేశీ టెక్నాలజీతో నడిపామని వెల్లడి
Railway network is going ahead rapidly in India says kishan reddy

భారత్‌లో రైల్వే నెట్ వర్క్ శరవేగంగా కొనసాగుతోందని... కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత తొమ్మిదేళ్లలో రైల్వే బడ్జెట్ పెరిగి, రైల్వే నెట్ వర్క్ విస్తరించిందన్నారు. ప్రయాణికుల సంఖ్య... వస్తు రవాణా కూడా పెరిగాయన్నారు. ఈ క్రమంలో వందే భారత్ రైళ్లను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం మన రైల్వే ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని... రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకునే తాము కృషి చేస్తున్నామన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృతంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రైల్వేకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. జనరల్ బడ్జెట్‌లో రైల్వేను విలీనం చేసి... ఆర్ధికపరమైన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. రైల్వే మన దేశ సమగ్రతకు అద్దం పడుతోందన్నారు. అన్ని రైల్వే స్టేషన్లను ఆధునికీకరించి.. కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నామన్నారు. 508 రైల్వే స్టేషన్లను అమృత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేసేందుకు మోదీ భూమి పూజ చేశారని గుర్తు చేశారు. ప్రధాని ఒకేరోజు ఇన్ని పనులు ప్రారంభించడం గిన్నిస్ రికార్డ్ అన్నారు. ఈ పనుల కోసం 25 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు.

సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రపంచంలో మొదటిసారిగా స్వదేశీ టెక్నాలజీతో మనం నడిపామని... కొంతమంది మూర్ఖులు ఈ ప్రక్రియను అవమానించారనీ, వక్రీకరించారని మండిపడ్డారు. వాటిని అధిగమించి వందే భారత్ రైళ్లు నేడు అద్భుతంగా నడుస్తున్నాయన్నారు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే విధంగా భద్రత, సౌకర్యాలతో రైళ్లు నడుస్తున్నాయని... వందేభారత్‌తో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, విశాఖకు కనెక్టివిటీ చేశామని తెలిపారు. మోదీ హయాంలో 85,434 కిమీ రైల్వే నెట్ వర్క్ కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. ఇది జర్మనీలో ఉన్న పూర్తి రైల్వే నెట్ వర్క్‌కు సమానమని తెలిపారు.

యూపీఏ హయాంలో 2004లో రైల్వే బడ్జెట్ 8 వేల కోట్లుగా ఉండగా... 2014లో 29 వేల కోట్లు మాత్రమే అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు 2.40 లక్షల కోట్లకు బడ్జెట్ పెరిగిందన్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణం కూడా 70 శాతం పెరిగిందన్నారు. కేంద్రం ఇప్పటి వరకు 38,650 కోట్లు కేవలం రైల్వే విద్యుద్దీకరణ కోసం ఖర్చు చేసిందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడంపై బీజేపీ దృష్టి సారించిందన్నారు.

More Telugu News