Parthasarathi: చంద్రబాబుతో భేటీ అవుతున్న వైసీపీ సీనియర్ నేత పార్థసారథి

  • వైసీపీని వీడుతున్న పార్థసారథి
  • నేడు హైదరాబాద్ లో చంద్రబాబును కలుస్తున్న వైసీపీ ఎమ్మెల్యే
  • ఈ నెల 18న టీడీపీలో చేరే అవకాశం
YSRCP MLA Parthasarathi to meet Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబుతో వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పార్థసారథి భేటీ కానున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ మధ్యాహ్నం ఆయన సమావేశం కానున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన చేరబోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు లేదా పెనమలూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానాన్ని ఆయన ఆశిస్తున్నట్టు సమాచారం.  

గత మంగళవారం రాత్రి ఆయన విజయవాడలోని తన కార్యాలయంలో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు 'రా.. కదలి రా' బహిరంగ సభ జరగనుంది. ఈ వేదికపై పార్థసారథి టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. 

ఇటీవల వైసీపీపై ఆయన బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరిచారు. గత కొన్ని రోజులుగా ఆయన వైసీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ తో భేటీ తర్వాత కూడా ఆయనకు పెనమలూరు టికెట్ పై క్లారిటీ రాలేదు. దీంతో, ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనను టీడీపీ నేతలు సంప్రదించడం, ఆయన తెలుగుదేశం వైపు మొగ్గు చూపడం జరిగిపోయాయి.

More Telugu News