Nallagatla Swamidas: వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్

  • 1994, 99లో తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచిన స్వామిదాస్
  • దాదాపు మూడు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన వైనం
  • నేడు సీఎం జగన్ సమక్షంలో  వైసీపీ కండువా కప్పుకున్న స్వామిదాస్
  • చంద్రబాబు తమను ఇంట్లోకి కూడా రానివ్వలేదని వెల్లడి
TDP ex MLA Nallagatla Swamidas joins YCP

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ నేడు వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో స్వామిదాస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. నల్లగట్ల స్వామిదాస్ తో పాటు ఆయన అర్ధాంగి సుధారాణి కూడా వైసీపీలో చేరారు. 

నల్లగట్ల స్వామిదాస్ దాదాపు మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు. ఆయన 1994, 1999 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ఇవాళ, సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ... అవసరం లేకపోతే చంద్రబాబు ఎవరినైనా పక్కనబెట్టేస్తారని ఆరోపించారు. ఆయనలో మానవత్వం మచ్చుకైనా లేదని విమర్శించారు. 

తాము టీడీపీలో దాదాపు 30 ఏళ్లు పనిచేసినా, తమను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదని స్వామిదాస్ వివరించారు. తాను, తన భార్య 10 రోజుల పాటు చంద్రబాబు ఇంటి ముందు పడిగాపులు కాసినా ఫలితం లేకపోయిందని, టీడీపీ నేతలే తమకు ద్రోహం చేశారని స్వామిదాస్ ఆరోపించారు.

More Telugu News