Bandi Sanjay: రామమందిర పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం విడ్డూరం: బండి సంజయ్

  • శ్రీరామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదన్న సంజయ్   
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న
  • కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చేలా ఉందని ఆరోపణ
Bandi Sanjay on Ayodhya Ram temple

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని... దీనిని రాజకీయం చేయడం సరికాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ... రామమందిర పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం విడ్డూరమన్నారు. ఈ వేడుకలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కాంగ్రెస్ తన విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. రామ మందిర నిర్మాణానికి వారు అనుకూలమా? కాదా? చెప్పాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించిందని... కానీ ఇప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరితే అందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీరు నిన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చేలా కనిపిస్తోందని విమర్శించారు. తెలంగాణలో యువతను డ్రగ్స్, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మద్యం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.40 వేల కోట్లను ఆర్జిస్తోందన్నారు. విద్యాసంస్థలలో మత్తుపదార్థాల దందా దారుణమన్నారు.

More Telugu News