koushik reddy: మధురై కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫొటోలను క్లిక్‌మనిపించిన కాంగ్రెస్ నేత

  • కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డిలపై ఠాగూర్ పరువు నష్టం దావా కేసు
  • ఈ రోజు మధురై కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ నాయకులు
  • తాను వేసిన కేసులో కోర్టుకు హాజరయ్యారంటూ ఠాగూర్ ట్వీట్
  • రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి ఆరోపణలపై పరువు నష్టం దావా వేశారా? అని బీఆర్ఎస్ కౌంటర్
Manickam clicks BRS MLAs photos in Madhurai

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ వేసిన పరువునష్టం దావా కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డిలు బుధవారం మధురై కోర్టుకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మాణిక్కం ఠాగూర్ తన ఎక్స్ హ్యాండిల్ వేదికగా ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్ నాయకులు తనపై చేసిన తప్పుడు ఆరోపణల మీద మధురై కోర్టులో పరువు నష్టం కేసు వేశానని... తనపై వచ్చిన ప్రతి ఆరోపణ పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. పరువు నష్టం దావా కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి... ఇద్దరూ మధురై కోర్టు వెలుపల కూర్చున్నారని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. వారికి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఠాగూర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కౌంటర్

మాణిక్కం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ కౌంటర్ ఇచ్చింది. మధురై కోర్టు వద్ద ఉన్న మా నాయకుల ఫొటోలను క్లిక్ చేయడానికి మీరు చెట్టు వెనుక దాక్కున్నారంటూ చురక అంటించింది. అయినా పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి కొనుక్కున్నారన్న మీ పార్టీ నాయకుడు కోమటిరెడ్డిపై ఏమైనా పరువు నష్టం దావా కేసు వేశారా? అని ప్రశ్నించింది. కాగా పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డి రూ.50 కోట్లకు కొనుగోలు చేశాడని... ఆ డబ్బులను మాణిక్కంకు ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు గతంలో ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై మధురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

More Telugu News