Namrata: మహేశ్ బాబు అభిమానుల గురించి నమ్రత ఎమోషనల్ పోస్టు

  • నిన్న గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్
  • సినిమా ఎలా ఉందో చెప్పడానికి నాన్న లేడన్న మహేశ్ బాబు
  • ఇక అభిమానులే తనకు అమ్మ, నాన్న అంటూ ఎమోషనల్
Namrata emotional pots on Mahesh Babu fans and super fans

మహేశ్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరులో గ్రాండ్ గా జరిగింది. సొంతగడ్డపై భారీగా తరలివచ్చిన అభిమానులను చూశాక మహేశ్ బాబు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. ఆయన ఎంత ఎమోషనల్ అయ్యారో ప్రసంగంలో గొంతు వణికిన తీరే చెబుతుంది. దీనిపై మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. మహేశ్ బాబు అభిమానులను ఆమె వేనోళ్ల కొనియాడారు. 

"మహేశ్ బాబు అంటే అభిమానులు, వీరాభిమానుల్లో ఎంత ప్రేమ ఉందో చెప్పే చివరి వ్యక్తిని బహుశా నేనే అనుకుంటా! మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రతి సందర్భంలోనూ మహేశ్ బాబుపై అపారమైన ప్రేమను కురిపిస్తుంటారు. మహేశ్ బాబు ప్రతి ప్రయత్నంలోనూ వారు వెన్నంటే ఉంటారు. కష్టకాలంలో మహేశ్ ను ముందుకు నడిపించేది వారే. 

మా సొంతూరు గుంటూరులో ఆయనకు, ఆయన గుంటూరు కారం టీమ్ కు లభించిన విశేష ఆదరణ చూశాక ఒక్క విషయం గర్వంగా చెప్పగలను... మీరు (అభిమానులు) మహేశ్ బాబుకు ఒక ఎమోషన్ గా ఎదిగిపోయారు. మీరు చూపించే ఈ ప్రేమను మేమున్నంత కాలం పదిలంగా కాపాడుకుంటాం. 

నేనింకో విషయం కూడా చెప్పదలచుకున్నాను... మేం మా ప్రేమను అనేక మార్గాల్లో వ్యక్తపరుస్తున్నాం... మా ప్రేమను మీరు అందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 

మహేశ్ బాబును గుండెల్లో పెట్టుకున్న మీ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా హృదయం ఆనందంతో నిండిపోయింది" అంటూ నమ్రతా శిరోద్కర్ తన పోస్టులో పేర్కొన్నారు.

More Telugu News