KTR: ఓటీపీ.. బ్యాంక్ వివరాలు షేర్ చేయకండి.. మల్లు భట్టి మాటలు విని డబ్బులు పోగొట్టుకోకండి : కేటీఆర్ హెచ్చరిక

  • ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా అంటూ కేటీఆర్ ట్వీట్
  • ప్రజాపాలన దరఖాస్తుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శ
  • ప్రజల రహస్య డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
  • ఎవరైనా ఫోన్ చేస్తే ఓటీపీ లేదా బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దని కేటీఆర్ హెచ్చరిక
Dont unnecessarily lose money listening to the words of Dy CM Bhatti Vikramarka says ktr

ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా... ఎవరికీ మీ ఓటీపీ, బ్యాంక్ వివరాలను షేర్ చేయకండి... ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాటలు విని డబ్బులు పోగొట్టుకోకండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు.

సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లనీయకండి... 

కొంతమంది ప్రయివేటు వ్యక్తులు ప్రజాపాలన దరఖాస్తుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని... ఇందుకు సంబంధించి వీడియోలను చూస్తున్నానని... అలాగే పలువురి నుంచి వింటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రజాపాలన దరఖాస్తు పత్రాలలో కోట్లాది తెలంగాణ ప్రజల సున్నితమైన డేటా ఉందని గుర్తు చేశారు. ఈ రహస్య డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి

ప్రియమైన తెలంగాణ సోదర, సోదరీమణులారా... ఎవరైనా మీకు పెన్షన్ లేదా ఇల్లు లేదా ఆరు గ్యారంటీలలో ఏదైనా ఇస్తామని కాల్ చేస్తే ఓటీపీని లేదా బ్యాంకు వివరాలను షేర్ చేయవద్దని కేటీఆర్ హెచ్చరించారు. డీప్యూటీ సీఎం మల్లు భట్టి మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. 

మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారా? లేదా ఇతర పార్టీకి వేశారా? అనే దాంతో సంబంధం లేదు. కానీ సైబర్ క్రైమ్ చట్టాన్ని రూపొందించడంలో భాగమైన వ్యక్తిగా నా మాటలను తీవ్రంగా పరిగణించండని విజ్ఞప్తి చేశారు. తద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని సూచించారు.

More Telugu News