గుర్తింపు లేని జనసేన పార్టీకి ఎలా అనుమతిచ్చారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగాం: విజయసాయిరెడ్డి

  • విజయవాడలో నేడు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం
  • వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి హాజరు
  • టీడీపీ భాగస్వామ్య పక్షంగా జనసేన హాజరైందన్న విజయసాయి
  • ఇప్పటివరకు జనసేనను బీజేపీ పార్టనర్ గా భావించారని వెల్లడి
  • ఇప్పుడా పార్టీ ఎవరి భాగస్వామ్య పక్షం? అంటూ ప్రశ్న
కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి వైసీపీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. సీఈసీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుర్తింపులేని జనసేన పార్టీకి ఎలా అనుమతిచ్చారన్న విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి తెలిపారు. 

"జనసేనను ఇప్పటివరకు బీజేపీ భాగస్వామ్య పార్టీగా పరిగణిస్తూ వచ్చారు. నిన్న ఎన్నికల సంఘానికి ఇచ్చిన అభ్యర్థనలో జనసేన పార్టీని టీడీపీ భాగస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. నిజంగా ఆలోచిస్తే... జనసేన పార్టీ ఇవాళ బీజేపీ భాగస్వామ్య పక్షమా, టీడీపీ భాగస్వామ్య పక్షమా... ఆ పార్టీకి ఎలా అనుమతి ఇచ్చారన్న అంశాన్ని సీఈసీకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అనే విషయాన్ని సీఈసీ ఎదుట ప్రస్తావించాం. 

జనసేన అనేది ఒక గుర్తింపులేని రాజకీయ పార్టీ. గ్లాసు గుర్తు అనేది జనరల్ సింబల్. 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లోనే పోటీ చేసే ఒక పార్టీకి సాధారణ గుర్తుల్లోంచి ఒక సింబల్ కేటాయించడం చట్ట విరుద్ధమని కూడా మేం వివరించాం" అని విజయసాయిరెడ్డి తెలిపారు.


More Telugu News

Vijayasai Reddy YSRCP CEC Janasena TDP Vijayawada BJP Andhra Pradesh