Chandrababu: ఆచంట సభలో 'సైకిల్ రాజా' పిట్టకథ చెప్పిన చంద్రబాబు

  • పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రా కదలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • పశ్చిమ గోదావరి ప్రజలు మర్యాదకు మారుపేరని కితాబు
  • ఒక్కసారి తప్పటడుగు వేశారని ఆవేదన
  • వైసీపీని నమ్మితే దోపిడీయేనని విమర్శలు
Chandrababu told short story in Achanta meeting

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మర్యాదకు మారుపేరు అని ఎన్టీఆర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఎటు చూసినా పచ్చని పంటపొలాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చిన కాటన్ ఇక్కడ బ్యారేజి నిర్మించాడని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఓ పిట్టకథ చెప్పారు.


సైకిల్ రాజా... బైక్ ఎక్కితే ఏం జరిగిందో చూడండి!

ఆచంట సభలో చంద్రబాబు ఓ పిట్టకథ చెప్పారు. రాజా అనే ఓ వ్యక్తి ఉండేవాడని, అతడు ఎప్పుడూ సైకిల్ పై ప్రయాణించేవాడని తెలిపారు. 

"పెట్రోల్ ఖర్చు లేదు, ఏ కష్టం లేదు... ఎక్కడికెళ్లాలన్నా సైకిల్ ఎక్కి దూసుకెళ్లేవాడు. అతడి జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ, ఒక వ్యక్తి వచ్చాడు... నువ్వు నాతోరా... స్పీడుగా తీసుకెళతాను... స్వర్గం చూపిస్తాను అని చెప్పాడు. ఆ విధంగా రాజాను మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు. 

కొంతదూరం పోయాక పెట్రోల్ అయిపోయింది... రాజాను పెట్రోల్ కొట్టించమన్నాడు. దాంతో చేసేదిలేక రాజా పెట్రోల్ కొట్టించాడు. మరికొంత దూరం వెళ్లాక బైక్ రిపేరు వచ్చింది. రాజాతోనే ఆ బైక్ రిపేరు చేయించాడు. ఇంకొంత ముందుకెళ్లాక చీకటిపడింది. బైక్ ఆపేసిన ఆ వ్యక్తి రాజా ఒంటిపై ఉన్న అన్నీ దోచుకుని వెళ్లిపోయాడు" అని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది కూడా ఇదేనని అన్నారు. 

రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగిపోయాయని, ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కరెంటు చార్జీలు, పెట్రోలు ధరలు, నిత్యావసరాల ధరలు పెంచబోమని చెప్పి, మాట తప్పారని మండిపడ్డారు.

కానీ ఒక్కసారి తప్పటడుగు వేశారు!

2014లో ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించారని చంద్రబాబు వెల్లడించారు. మొత్తం 3 ఎంపీ స్థానాల్లో టీడీపీకే విజయం అందించారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన జైత్రయాత్రను ఇక్కడ్నించే ప్రారంభిస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీనే కాదు జనసేన పార్టీని కూడా ఎక్కువగా అభిమానించే జిల్లా పశ్చిమ గోదావరి అని చంద్రబాబు పేర్కొన్నారు. 

కానీ, మొట్టమొదటిసారిగా ఒక్కసారి తప్పటడుగు వేశారని, అది 2019లో అని వెల్లడించారు. "వైసీపీ సినిమా అయిపోయింది. తొందరలోనే వీళ్లు పోతారు. ఈ ఐదేళ్లలో ప్రజల జీవితాలు ఏమైనా మారాయా? ఈ ముఖ్యమంత్రి మాయమాటలు చెబుతున్నాడు" అంటూ విమర్శించారు.

More Telugu News