KTR: పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి కేటీఆర్.. పోయిన బలం పెంచుకునేందుకే!

  • లోక్‌సభ ఎన్నికలతో బలం పెంచుకునే యోచనలో బీఆర్ఎస్
  • మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి కేటీఆర్
  • పోటీకి ఓకే చెప్పకున్నా నో మాత్రం చెప్పలేదంటున్న పార్టీ వర్గాలు
KTR may contest in lok sabha elections

రానున్న లోక్‌సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి లేదంటే సికింద్రాబాద్ నుంచి ఆయనను నిలబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. లోక్‌‌సభకు పోటీ చేసే విషయమై కేటీఆర్ ఓకే చెప్పకపోయినా నో అని మాత్రం చెప్పలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో లోక్‌‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా జాతీయస్థాయిలో బీఆర్ఎస్ ప్రాధాన్యం పెంచాలని పార్టీ భావిస్తోంది.

గత ఎన్నికల్లో 9 స్థానాలకే పరిమితం
2018 ఎన్నికల్లో 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో మాత్రం 9 స్థానాలకే పరిమితమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7 లోక్‌‌సభ స్థానాల పరిధిలోనే ఆధిక్యం సాధించింది. ఇందులో మూడింటిలో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, నాలుగు స్థానాల్లో మాత్రమే కాస్తంత ఎక్కువ ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ బరిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఆరింటిని గెలుచుకుంది. మల్కాజిగిరి పరిధిలోని ఏడు స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో అయితే మల్కాజిగిరి, లేదంటే సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

More Telugu News