Siddipet: సిద్ధిపేటలో షాకింగ్ ఘటన.. హిజ్రాగా మారి వేధిస్తున్న భర్తను హత్య చేయించిన భార్య

  • కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో కలిసి హత్యకు పథక రచన
  • రూ.18 లక్షలు సుపారి ఇచ్చి హత్య చేయించిన నిందితురాలు వేదశ్రీ
  • గతేడాది డిసెంబర్ 11న హత్య.. పోలీసులు రంగంలోకి దిగడంతో బయటపడ్డ నిజాలు
Wife killed her harassing husband who became hijra

సిద్దిపేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హిజ్రాగా మారి తనను వేధింపులకు గురిచేస్తున్న భర్తను ఓ మహిళ అడ్డుతొలగించుకుంది. సుపారీ ఇచ్చి మర్డర్ చేయించింది. గత నెలలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సీఐ కృష్ణారెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. సిద్దిపేట బోయిగల్లీకి చెందిన వేదశ్రీ అనే మహిళకు నాసర్‌పురా వీధికి చెందిన దరిపల్లి వెంకటేశ్‌తో 2014లో వివాహమైంది. వీరికి ఒక పాప ఉంది. అదనపు కట్నం కోసం వెంకటేశ్ భార్యను వేధించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అయితే వెంకటేశ్ ప్రవర్తనలో క్రమంగా మార్పులు వచ్చి అతడు హిజ్రాగా మారిపోయి రోజాగా పేరు మార్చుకున్నాడు. గొడవలు ముదరడంతో గత ఏడేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే కూతుర్ని తనకు అప్పగించాలంటూ వేదశ్రీని రోజా వేధించేవాడు. దీంతో తాను కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న సిద్ధిపేటకే చెందిన బోయిని రమేశ్‌తో కలిసి రోజాను హత్య చేయాలని వేదశ్రీ నిర్ణయించింది.

గత ఏడాది డిసెంబరు 11న నాసర్‌పురాలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న రోజాను హత్య చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన రమేశ్‌ స్నేహితుడు ఇప్పల శేఖర్‌ రోజాతో మద్యం తాగించాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదయింది. అయితే పోస్టుమార్టంలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా వేదశ్రీతో పాటు మరో ఐదుగురి పాత్ర ఉందని నిర్ధారించారు. 

నిందితురాలు వేదశ్రీ సహా ముగ్గురిని సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. వేదశ్రీ, బోయిని రమేశ్‌, ఇప్పల శేఖర్‌లను శనివారం అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. కాగా  కుమార్తెను తనకు ఇవ్వాలంటూ భార్య వేదశ్రీని రోజా వేధించేవాడని, ఆమె ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ప్రైవేటు పాఠశాల వద్దకు వెళ్లి ఇబ్బందులకు గురిచేసేవాడని పోలీసులు తెలిపారు. వేదశ్రీ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న బోయిని రమేశ్‌తో కలిసి హత్యకు పథక రచన చేసింది. ఇందుకు రూ.18 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, రెండు విడతల్లో రూ.4.60 లక్షలు ముట్టజెప్పారని పోలీసులు తెలిపారు.

More Telugu News