Revanth Reddy: 'రెండేళ్ల ముఖ్యమంత్రి' అంటున్నారని అడగగా.. రేవంత్ రెడ్డి సమాధానం ఇదే!

  • రెండేళ్లే ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలకు న్యాయం చేస్తానన్న రేవంత్ రెడ్డి
  • నేను టీమ్ లీడర్‌ను మాత్రమే.. అందరి సహకారంతో ముందుకు సాగుతానని వెల్లడి
  • రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కానన్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy on his chief minister post

తాను రెండేళ్లు లేదా మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలకు న్యాయం చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మీరు రెండేళ్లు లేదా మూడేళ్లే ముఖ్యమంత్రిగా ఉంటారనే చర్చ జరుగుతోంది కదా... అని రాధాకృష్ణ ప్రశ్నించారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ... ఎన్నికలకు ముందు తానే ముఖ్యమంత్రినంటూ చాలామంది చెప్పుకున్నారని.. కానీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అయిందన్నారు. తాను కేవలం టీమ్ లీడర్‌ను మాత్రమేనని... తన కేబినెట్లోని మంత్రులంతా చాలా సీనియర్లు అని.. వారి సలహాలు.. సూచనలతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

తాను కేంద్ర మంత్రులను కలిసినా ఆ శాఖకు సంబంధించిన మంత్రితో కలిసి వెళ్తున్నానని గుర్తు చేశారు. వన్ మ్యాన్ షో చేయదలుచుకోలేదన్నారు. నేనే బ్యాటింగ్... నేనే ఫీల్డింగ్... నేనే బౌలింగ్ చేయలేనన్నారు. అందరితో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు. ప్రచారం జరిగినట్లు తాను రెండేళ్లు సీఎంగా ఉన్నా.. మూడేళ్లు ఉన్నా ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. అంతకంటే సంతోషం ఏముంటుంది? అని ప్రశ్నించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఇప్పుడు సీఎం అంటే ఎవరెస్ట్ ఎక్కినట్లే అన్నారు.

More Telugu News