Dwarampudi Chandrasekhar Reddy: పవన్ కల్యాణ్ కు మరోసారి సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి

  • పవన్ దమ్ముంటే తనపై పోటీ చేయాలన్న ద్వారంపూడి
  • పవన్ కు గతంలోనే సవాల్ విసిరానని వెల్లడి
  • కాకినాడలో గ్లాసు గుర్తుతో అభ్యర్థినైనా బరిలో దించాలని వ్యాఖ్యలు  
Dwarampudi challenges Pawan Kalyan again

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్ కు మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేయాలంటూ పవన్ కల్యాణ్ కు గతంలోనే చాలెంజ్ విసిరానని, ఇప్పుడు మళ్లీ సవాల్ చేస్తున్నానని అన్నారు. ఇటీవల పవన్ మూడ్రోజుల పాటు కాకినాడలో ఉన్నప్పుడైనా స్పందించాలని కోరానని, కానీ ఆయన తన సవాల్ ను స్వీకరించకుండానే వెళ్లిపోయాడని అన్నారు. దాంతో తాను ప్రెస్ మీట్ పెట్టి, కనీసం గ్లాసు గుర్తుతో తనపై వాళ్ల అభ్యర్థినైనా నిలపాలని పేర్కొన్నానని ద్వారంపూడి వివరించారు. 

"కాకినాడలో పవన్ ఎవర్ని బరిలో దింపుతాడో చూద్దాం... ఎవరిని దింపినా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాకినాడలో గాజు గ్లాసు గుర్తుతో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని భావిస్తున్నాను. గ్లాసు గుర్తుతో అభ్యర్థిని బరిలో దింపకపోతే... పవన్ కల్యాణ్ గతంలో నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టే లెక్క" అని ద్వారంపూడి స్పష్టం చేశారు.

More Telugu News