Kodali Nani: చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై కొడాలి నాని విమర్శలు

  • చంద్రబాబు ఏనాడూ బీసీలను పట్టించుకోలేదన్న కొడాలి నాని
  • బీసీలు తన వెన్నెముక అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్న
  • బీసీలకు జగన్ నాలుగు రాజ్యసభ పదవులు ఇచ్చారని వ్యాఖ్య
Kodali nani fires on Chandrababu and Pawan Kalyan

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తనదైన శైలిలో మరోసారి విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని చంద్రబాబు... ఇప్పడు బీసీ భజన చేస్తే ఎవరు పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ను వెనకాల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు... బీసీలు తన వెన్నెముక అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. 

దివంగత ఎన్టీఆర్ తీసుకొచ్చిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప బీసీల కోసం చంద్రబాబు చేసిందేముందని కొడాలి నాని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ బీసీలకు నాలుగు రాజ్యసభ పదవులు ఇచ్చారని... తన రాజకీయ ప్రస్థానంలో ఒక్క బీసీనైనా చంద్రబాబు రాజ్యసభకు పంపించారా? అని అడిగారు. ఓసీ రిజర్వుడు పదవులను కూడా బీసీలకు ఇస్తూ... బీసీలకు జగన్ ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని అన్నారు.

More Telugu News