Medak: ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ.. ఆవేశంతో పెళ్లి బృందంపైకి కారు.. ఒకరి మృతి

  • పెళ్లి కూతురిని మెట్టినింటికి పంపించి తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ
  • ఆగ్రహంతో పెళ్లి బృందంపైకి కారు ఎక్కించిన వ్యక్తి
  • ఓ యువతి మృతి, పలువురికి తీవ్ర గాయాలు
  • మెదక్ జిల్లా చేగుంట మండలంలో విషాద ఘటన
Clash between two people and A car hit the wedding party

మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివాహం తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఓ యువతి ప్రాణాలు తీసింది. ఓ వ్యక్తి ఆగ్రహంతో పెళ్లి బృందంపైకి కారు ఎక్కించడంతో యువతి మృతి చెందింది. రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి కూతురు సువర్ణ పెళ్లి గురువారం జరిగింది. పెళ్లికూతురిని ఊరేగింపుగా కామారెడ్డి జిల్లా బికనూరు మండలం లక్ష్మిదేవిపల్లిలోని మెట్టినింటికి పంపించారు. అయితే తిరిగి ఇంటికి వస్తుండగా అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్‌, స్వామి మధ్య గొడవ జరిగింది. 

ఈ ఘర్షణలో స్వామిని నరేందర్ నెట్టివేశాడు. కిందపడిన స్వామిని అక్కడున్న వారు పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన నరేందర్‌ తన థార్‌ కారును తీసుకొచ్చి అక్కడ ఉన్న పెళ్లి బృందంపైకి ఎక్కించాడు. ఈ ఘటనలో రమ్య (23) అనే యువతి తీవ్రంగా గాయపడడంతో, ఆమెను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. ఇక ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయని స్థానిక ఎస్సై హరీశ్‌ వెల్లడించారు. నిందితుడు నరేందర్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు.

More Telugu News