Kodali Nani: షర్మిల ఓట్లు చీల్చుతారన్న వాదనలపై కొడాలి నాని లాజిక్ ఇదే!

  • కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసిన షర్మిల
  • షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల తమకేమీ ఇబ్బంది లేదన్న కొడాలి నాని
  • కాంగ్రెస్ కు ఏం ఓటు బ్యాంకు వుందని ఓట్లు చీలతాయని వ్యంగ్యం
  • పురందేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓట్లు చీలతాయా అంటూ వ్యాఖ్యలు
Kodali Nani reaction on Sharmila joins Congress Party

వైఎస్సార్టీపీ చరిత్ర ముగిసింది. పార్టీ ఏర్పడిన కొన్నేళ్లకే జాతీయ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైపోయింది. ఇవాళ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే. కాగా, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికరంగా స్పందించారు.

షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ ఓట్లు ఎందుకు చీలతాయి? అలాంటప్పుడు పురందేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓట్లు చీలవా? అంటూ లాజిక్ ను ప్రదర్శించారు. ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. వైసీపీకి పనికిరానివాళ్లంతా టీడీపీకి పనికివస్తారని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణ పరిస్థితికి దిగజారడానికి రెండు కారణాలు ఉన్నాయని తెలిపారు. "ఒకటి... రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలికి వదిలేశారు.... రెండోది, రాష్ట్రంలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయాక ముద్దాయిగా చేశారు... ఆయన కుటుంబంలోని జగన్ మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ రెండు కారణాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దిక్కుమాలిన పరిస్థిని ఎదుర్కొంటోంది" అని విమర్శించారు. ఈ రెండు కారణాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్ కు క్షమాపణలు చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

More Telugu News